ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంతో శక్తివంతమైన శ్రీవీరాంజనేయస్వామి ఆలయం ఇదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 14, 2020, 07:33 PM

హనుమంతుడు కొలువై ఉన్న ఏ ఆలయంలోని బండరాళ్ల నుండి ఎప్పుడు నీరు జాలు వారుతూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందనే విషయం ఇప్పటికి ఒక రహస్యమే. మరి ఆ ఆలయానికి భీమునికి సంబంధం ఏంటి? ఈ ఆలయ స్థల పురాణం ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న మరిన్ని విశేషాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని, రాజన్న సిరిసిల్ల జిల్లా లోని, భీముని మల్లారెడ్డిపేటలో శ్రీవీరాంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో హనుమంతుడు తొమ్మిది అడుగుల ఏకశిలా విగ్రహమూర్తిగా భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఈ గ్రామానికి ఆ పేరు ఎందుకు వచ్చిందనే దానికి ఒక ఆసక్తికర కథ వెలుగులో ఉంది. పూర్వం మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాసం చేస్తూ ఇక్కడ సంచరించినట్లుగా మల్లారెడ్డిపేట ప్రాంతానికి గుర్తింపు ఉంది. ఆ కాలంలో పాండవులు కొన్ని ఆటలు ఆడారని ప్రచారం. అలా ఆట ఆడుతుండగా ఒక బండ కిందకు చిర్ర వెళ్లి పడిందట. అప్పుడు అగ్రజుడైన ధర్మరాజు దానిని తీసుకురావాలని భీముడిని కోరాడట. భీముడు బండను నెత్తితో పైకి ఎత్తి చిర్రను తెచ్చాడట. దీనికి నిదర్శనం గా ఓ గుహ మనకు ఇక్కడ కనిపిస్తుంది. అందువల్లనే మల్లారెడ్డిపేటను భీముని మల్లారెడ్డిపేట గా పిలుస్తారని ప్రతీతి. ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే, సీతారాముల ఆలయంతోపాటు వేంకటేశ్వరస్వామి, శివుడి ఆలయాలు కూడా ఉన్నాయి. పూర్వం ఈ మూడు ఆలయాలను భక్తులు దర్శించుకుని రోజూ పూజలు చేసేవారు.దేవుళ్లకు ఎంతో ప్రీతితో పలు రకాల నైవేద్యాలు తీసుకెళ్లేవారు. కానీ, అక్కడ ఒక రావిచెట్టు మీద ఉన్న బ్రహ్మరాక్షసి ఆ ప్రసాదాలను అపవిత్రం చేస్తుండేది. ప్రసాదాలను స్వామికి సమర్పించకుండా ఆటంకాలు కలిగిస్తుండడంతో వారు ఎంతో ఆందోళనకు గురై, ఒకరోజు రాత్రి రాముని కోవెలలో నిద్రించారు. ఆ రాత్రి వారికిఆంజనేయస్వామి కలలో ప్రత్యక్షమై తాను సమీప గ్రామంలో ఉన్నానని, తనను ఇక్కడకు తీసుకువచ్చి ప్రతిష్ఠించాలని చెప్పడంతో గ్రామస్థులంతా ఎడ్లబండ్లతో ఆ ప్రాంతానికి వెళ్లి తవ్వకాలు జరిపారు. ఆశ్చర్యం..! సుందరాకారం లో తొమ్మిది అడుగుల ఏకశిల వీరాంజనేయస్వామి విగ్రహం బయటపడింది. స్వామివారు కలలో చెప్పిందే కంటి ముందు సాక్షాత్కరించడంతో గ్రామస్థుల ఆనందానికి అంతులేదు. గ్రామ శివారులోకి విగ్రహం చేరుకోవడంతోటే రావిచెట్టుపై ఉన్న బ్రహ్మరాక్షసి మంటల్లో కాలిపోయిందట.బ్రహ్మరాక్షసిని హతం చేసిన వీరాంజనేయస్వామి విగ్రహాన్ని రాములోరి పాదాల ముందు ప్రతిష్ఠించారు. ఆలయ విషయానికి వస్తే, కాకతీయు కాలంలో కట్టిన ఈ రెండంతస్థుల అపురూప రాతి కట్టడానికి ఎదురుగా తొమ్మిది అడుగుల వీరాంజనేయస్వామి, వెంకటేశ్వరస్వామి, శివుని ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ కాకతీయుల కాలంలో నిర్మితమైనట్లు ఆనవాళ్లను బట్టి స్పష్టమవుతుంది. ఈ ఆలయాలన్నీ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఆలయ ప్రాకారాల మీద ఉన్న శిల్పకళ నాటి శిల్పుల కళా నైపుణ్యాన్ని చాటుతుంది. రామాలయంలోని సీతారాముల విగ్రహాల పాదాలకు సమాంతరంగా, ఎదురుగా వీరాంజనేయస్వామి విగ్రహం రూపుదిద్దుకోవడం చెప్పుకోదగ్గ విశేషం. వీరాంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తులు విధిగా మాండవ్య నది ప్రస్తుతం ఇప్పటి మానేరు వాగు దాటాల్సిందే. కాళ్లకు తడి తాకనిదే ఆలయంలోకి ప్రవేశించలేం. అప్పట్లో మాండవ్య మహాముని తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతంలోని వాగుకు మాండవ్య నది అని పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఆలయం చుట్టూ ఈ నది ప్రవహిస్తుంది. భక్తులు ఏ దిక్కున వచ్చినా నదిలో కాలు తడవాల్సిందే. ఆలయ ఆవరణలో ఉన్న గుండం ఎప్పుడూ ఎండిపోదు. కరువు వచ్చినా, ఎన్నో సంవత్సరాలు వానలు కురవకపోయినా గుండంలో నీరు ఎండిపోదు. అందుచేత ఈ గుండంలోని జలాలను ఎంతో పవిత్రమైనవిగా స్థానికులు భావిస్తారు. ఆలయ పరిసరాల్లోని బండ రాళ్ల నుంచి నీరు జాలు వారుతుంది. ఈ దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com