నటుడు కృష్ణుడు తన తాతను కోల్పోయినట్లుగా ట్వీట్ చేశారు. ఇంతకీ ఆయన తాత ఎవరనుకుంటున్నారు? పెన్మత్స సాంబశివరాజు. వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు (87) అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడుగా ఆయన గుర్తింపు పొందారు. అలాగే మంత్రి బొత్సకు రాజకీయ గురువుగా కూడా ఈయనను చెప్పుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా కూడా పెన్మత్స సాంబశివరాజు గుర్తింపును పొందారు.
‘‘మా తాతగారు పెన్మత్స సాంబశివరాజుగారు ఈ రోజు మృతి చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడాయన. సివిల్ సప్లయ్ మినిస్టర్, ట్రాన్స్ఫోర్ట్, సుగర్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ మినిస్టర్ వంటి ఎన్నో పదవులను ఆయన అలంకరించారు. ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో పోరాడిన గొప్ప నాయకుడు..’’ అని కృష్ణుడు తన ట్వీట్లో పేర్కొన్నారు.