పిల్లనిచ్చిన అల్లుడినే మామ అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. మెడతో ఇద్దరు మనవరాళ్లను వెంటబెట్టుకుని స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన తూర్పు గోదావరి జిల్లా, రౌతలపూడి మండలం డీజే పురంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డీ.జే. పురానికి చెందిన పల్లా సత్యానారాయణ కూతురు పెళ్లైన కొన్నేళ్లకే అనుమానాస్పద రీతిలో చనిపోయింది. దీంతో సత్యనారాయణ తన కుమార్తె మరణించిన తర్వాత ఆమె ఇద్దరు బిడ్డలను తన ఇంటికి తీసుకొచ్చుకొని పెంచుతున్నారు. వారిని చూడటానికి తరచూ అల్లుడు వచ్చిపోతుండేవాడు.గత శనివారం రాత్రి కూడా అల్లుడు ఇలాగే వచ్చాడు. దీంతో మామ అతడికి మర్యాదలు చేశాడు. అయితే పీకల దాకా మందు తాగిన తర్వాత మత్తులో మీ కూతురిని నేనే చంపానని సత్యనారాయణతో అల్లుడు చెప్పాడు. దీంతో సత్యనారాయణలో కోపం కట్టలు తెంచుకుంది. తన బిడ్డను చంపిన అల్లుడిని చంపాలనుకున్నాడు. అల్లుడు, మనవరాళ్లు అందరూ నిద్ర పోయిన తర్వాత అల్లుడి మెడను కత్తితో నరికాడు. ఆదివారం ఉదయం ఆ తలను సంచిలో వేసుకుని.. తన ఇద్దరు మనవరాళ్లను వెంటబెట్టుకొని అన్నవరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.