కరోనా నేపథ్యంలో సానిటైజర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఓ దొంగ సానిటైజర్ కోసం బ్యాంకుకే కన్నం వేశాడు. టిఒఐ కథనం మేరకు..అమెరికాలోని సియోక్స్ సిటీ పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. మూడు చోట్ల గుర్తుతెలియని వ్యక్తి దోపిడీకి ప్రయత్నించినట్లు సమాచారం అందింది. ఈ సందర్భంగా పోలీసులు మార్క్ గ్రే అనే 39 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు నేషనల్ బ్యాంకుతోపాటు నెబ్రస్కా స్ట్రీట్లోని కౌన్సెలింగ్ సర్వీస్ అద్దాలను పగలగొట్టాడు. చివరికి ఓ ఇటాలియన్ రెస్టారెంటులో దూరి పోలీసులకు దొరికిపోయాడు. విచారణలో భాగంగా గ్రేను ప్రశ్నించగా.. షాకింగ్ విషయం చెప్పాడు. తాను బ్యాంకులోకి వెళ్లింది కేవలం సానిటైజర్లను దొంగతనం చేయడానికి మాత్రమేనని తెలిపాడు. ఆ తర్వాత కొద్దిపాటి నగదు కోసం కౌన్సిలింగ్ సర్వీస్, రెస్టారెంట్లలోకి దూరానని చెప్పాడు. పోలీసులు అతడిపై మూడు కేసులు నమోదు చేశాడు. అతడు దొంగిలించినది సానిటైజరైనా సరే తప్పు తప్పేనని, బ్యాంకుకు కన్నం వేయాలనే ఆలోచన రావడమే పెద్ద నేరమని పోలీసులు అతడి అరెస్టు చేశారు.