రాజస్థాన్ లో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి కుటుంబంలోని 12 మంది ఒకేసారి విషం తాగారు. వీరిలో 11 మంది మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని చికిత్స నిమిత్తం తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ఈ విషాధ సంఘటన రాజస్థాన్లోని దేచు పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహ్దాతాలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు..పాకిస్తాన్లోని సింధూ ప్రావిన్స్కు చెందిన కుటుంబం కొన్నేళ్ల క్రితం రాజస్థాన్కు వలస వచ్చింది. వీరంతా హిందూ శరణార్థులు. కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో పురుగుల మందు వాసన వస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కుటుంబ సభ్యులందరూ ఒకే సారి ఆత్మహత్య చేసుకోవడంతో కేసుకు సంబంధించి విచారణను పోలీసులు ముమ్మరం చేశారు.