మోసమే ఆమె పెట్టుబడి. అబద్ధాలే ఆయుధం. మాయమై పోవడం తన ప్రత్యేకత. ఇలా ఆమె లక్షలు కాదు.. ఏ మాత్రం కష్టపడకుండా కోటికి పైగా సంపాధించింది. ఇంకా సంపాధించాలనుకుంది. కానీ అడ్డంగా దొరికిపోయింది. ఇన్నాళ్లు నోట్ల కట్టలు లెక్కపెట్టిన ఆమె ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెడుతోంది. జార్ఖండ్ కు చెందిన ఆ యువతి మొదట ఓ మాట్రీ మెనీ సైట్ లో రిజిస్టర్ చేయించుకుంది. ఫొటో షాప్ లో తన ఫొటోను మరింత అందంగా కనిపించేలా మార్చి అప్ లోడ్ చేసింది. బాగా డబ్బున్న వాళ్లను వెతికి ఆ ఫొటోలను వాళ్లకు పంపించేది.
అలా అవి చూసిన నిలయ్ కుమార్ అనే వ్యక్తి ఇంత అందమైన అమ్మాయి భార్యగా వస్తే జీవితానికి ఇంకే కావాలి అనుకున్నాడు. ఆమెతో ఫోన్లో మాట్లాడాడు. ఆమె మాటలు అతడిని ఇంకా ఆకర్షించాయి. ఇలా విషయం పెళ్లి వరకు వచ్చింది. 2015లో వీరి వివాహం జరిగింది. ఫొటోలో ఉన్నంత అందంగా ఆమె లేదని గుర్తించినా.. ఇంత పద్ధతి కలిగిన అమ్మాయి నాకు దొరకడం అదృష్టమంటూ ఆనందించాడు. జీవిత భాగస్వామి కదా అన్న నమ్మకంతో కోట్ల రూపాయలు దాయమని ఆమె చేతిలో పెట్టాడు. బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పేశాడు. రెండేళ్లలో దాదాపు రెండు కోట్ల వరకు ఆ కిలాడీ వెనకేసుకుంది. ఒక మంచి రోజు చూసి డబ్బులతో మాయమైంది.
కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని ఎంజాయ్ చేసిన తర్వాత.. మరో మాట్రిమోనియల్ సైట్లో తన వివరాలు. ఫొటోలు పెట్టింది. ఈసారి గుజరాత్కి చెందిన అమిత్ మోదీ ఆమె వలకు చిక్కాడు. అతను డబ్బులు ఈమె చేతిలో పెట్టకపోయే సరికి మా బంధువులు బాధల్లో ఊన్నారంటూ కన్నీళ్లు పెట్టుకునేది. వివిధ కారణాలు చెప్పి మొత్తం రూ.45 లక్షలు అతని వద్ద లాగేసింది. కొన్నాళ్లకు అక్కడి నుంచి జంప్ అయ్యింది. మళ్లీ కొన్ని రోజుల తర్వాత మరో మాట్రిమోనీ వెబ్ సెట్ లో ఖాతా తెరిచింది. ఈ సారి కాలిఫోర్నియాలో ఉద్యోగం చేసే సుమిత్ దశరథ్ పవార్ అనే వ్యక్తికి గాలం వేసింది. అమాయకుడైన అతను చాలా సులువుగా ఈ కిలాడి మాటలు నమ్మాడు. విషయం పెళ్లి వరకు వచ్చింది. అతడిది సంప్రదాయ కుటుంబం కావడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. దీంతో కరోనా సమయం కావడంతో మాస్కు ధరించి పెళ్లిలో మేనేజ్ చేద్దామని భావించింది. మూడు ముళ్లు పడితే నన్ను ఎవరూ ఏం చేయలేరని డిసైడయ్యింది.
పెళ్లి ప్రారంభమైన కొద్ది సేపటికి ఆ మాయలేడి మొబైల్ పెళ్లి కుమారుడి తల్లికి అనుకోకుండా ఇవ్వాల్సి వచ్చింది. లాక్ లేక పోవడంతో ఆమె ఆ ఫోన్లో ఫొటోలు చూద్దామని గ్యాలరీ ఓపెన్ చేసింది. ఆ మాయలేడీ అసలు ఫొటోలు చూసి షాకైంది. వెంటనే తన కుమారుడికి ఈ విషయం చెప్పడంతో ఆమెతో మాస్కు తీయించారు. ఆమె అసలు ఫొటోలు చేసి అంతా షాకయ్యారు. అప్పటి నుంచి తల వంచుకున్నది ఇందుకా అంటూ ఆశ్యర్య పోయారు. ఆ ఫోన్ లో ఆ కిలాడి తన మొదటి భర్తతో దిగిన పెళ్లి ఫొటోలు కూడా కనిపించడంతో ఆమెను నిలదీశారు. దీంతో తనకు ఇది మూడో పెళ్లి అంటూ నిజం చెప్పుకొచ్చింది. బాధితుల ఫిర్యాదుతో ఆ మాయలేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.