తమిళనాడు దిండుగల్ జిల్లా, పళని పట్టణవాసులు రాత్రి ఎప్పటిలాగే తలుపులు గడేసుకుని నిద్రపోయారు. ఉదయం లేచి తలుపు తెరచే సరికి.. గుమ్మం ముందు న్యూస్ పేపర్ ఉండాల్సిన స్థానంలో.. పసుపు, కుంకుమ పూసిన పుర్రెలు దర్శనమిచ్చాయి. ఎముకలు నోట కరచిన కపాలాలు చూసి ఒక్కసారిగా గుండెలాగేంత వణుకుపుట్టింది. వెంటనే ఇంట్లోవారికి చెప్పి బయటికి పరుగులు తీస్తే... ఇంకేముంది వీధిలో దాదాపు అందరి ఇళ్లలో అదే కలకలం.పళని, దేవనగర్ వీధిలో ఇళ్లు, దుకాణాల ముందు మానవ అవశేషాలు కనిపించేసరికి ప్రజలు తీవ్రభయభ్రాంతులకు గురవుతున్నారు. అర్థరాత్రి బాణామతి(చేతబడి) చేసేందుకు క్షుద్ర పూజలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. అయితే, ఇదంతా చేసిందెవరు, ఏ సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే సంగతి తెలియాల్సి ఉంది. కాలనీవాసుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.