ఉల్లి పంటకు మద్దతు ధర రాక రైతులు ఆర్ధికంగా తీవ్రంగా నష్ట పోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వాపోయారు. రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు 34 లక్షలు క్వింటాల్ ఉల్లి దిగుబడి వచ్చిందని, ఉల్లి సాగు చేసిన రైతులు పంట కొనుగోలు లేకపోవటంతో, మద్దతు ధర రాక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎకరాకు 70 నుంచి 80 వేలు వెచ్చించి ఉల్లి పంటను వేసిన రైతులకు కన్నీరు మిగిలిందన్నారు. ఉల్లి పంటలు అమ్మకాలకు ప్రధాన మార్కెట్ కేంద్రమైన కర్నూల్ మార్కెట్ యార్డ్ కరోనా తీవ్రత కారణంగా మూతబడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం చెపుతున్నట్లుగా సచివాలయాల వద్ద కొనుగోలు జరగటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉల్లిపంటను రైతుల వద్ద నుంచి వారి గ్రామంలోనే మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరారు.