కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఆరు మంది మున్సిపల్ కార్మికులకు కరోనా సోకడంతో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు యూనియన్ నుండి ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు 7మందికి 10500రూ.లు సహాయం చేసినట్లు సి.ఐ.టి.యు. అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణయ్య, భాస్కరాచారి, నాయకులు ఆదాము, రామకృష్ణ, కరిముల్లా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వచ్చిన కుటుంబాలను ఆదుకోవడంలో విఫలం చెందాయన్నారు.ముఖ్యంగా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికులను ఆదుకుంటామని మాటలు మాత్రమే చెబుతూ చేతుల్లో శూన్యం అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా వచ్చిన ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు ఇచ్చి అవసరమైన కరోనా కిట్ సరఫరా చేయాలని అన్నారు. ప్రతి ఒక్క కార్మికునికి అండగా ఉండేందుకు సి.ఐ.టి.యు. పోరాటాలే కాదు సహాయం చేయడంలో ముందుంటామని అన్నారు.