మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుందారంలో భూతవైద్యానికి వివాహిత రజిత బలైంది. శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలో పుట్టిన ఊరిలో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు..శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన కనుకుంట్ల రజితకు పుట్టినప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. పుట్టిన రెండు, మూడురోజులకే తల్లి స్వరూప కన్నుమూసింది. తండ్రి నర్సయ్య ఊళ్లో పశువుల కాపరీగా పనిచేసి కూతురిని చూసేవాడు. రజిత తండ్రి నర్సయ్య పద్మను రెండో వివాహం చేసుకున్న తర్వాత గద్దపాక వాగులోని బావిలో ప్రమాదవశాత్తు పడి రజిత తండ్రి నర్సయ్య పదేళ్లక్రితం మృతిచెందాడు. పినతల్లి పద్మ రజితను ఉన్నత చదువులు చదివించింది. ఈ క్రమంలో హైదరాబాద్లో ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన వ్యక్తితో ప్రేమ పెళ్లిపీటలెక్కించగా నాలుగునెలల క్రితం రజిత ఆడపిల్లకు జన్మనిచ్చింది.కొన్నినెలలుగా రజిత అనారోగ్యానికి గురికాగా వారంక్రితం భూతవైద్యుడు దొగ్గల శ్యామ్ను తీసుకువచ్చారు. భూతవైద్యం పేరుతో రజితకు దయ్యం పట్టిందని తలవెంట్రుకలు పట్టుకుని విచక్షణారహితంగా కొడుతూ మంచంపై పడేయడంతో తలకు గాయమైంది. ఐదురోజుల క్రితం కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేస్తుండగా సోమవారం అర్థరాత్రి మృతి చెందింది. భూతవైద్యంతో రజిత ప్రాణాలు బలిగొన్న అత్తింటివారితోపాటు భూతవైద్యుడికి సహకరించిన బాబాయ్ రవీందర్పై జైపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రజిత మృతితో నాలుగునెలల చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు.