పబ్ జీ.. ఏంతో మంది పిల్లలు, యువత ప్రాణాలు తీసిన ఆట. ఈ పాడు పబ్జీ కారణంగా ఎంతో మంది చిన్నారుల చదువులు దెబ్బతిన్నాయి. మరి కొందరి జీవితాలే బలయ్యాయి. తాజాగా పంజాబ్లోని జలంధర్లో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. పబ్జీ ఆడవద్దని హెచ్చరించినందుకు తండ్రితో గొడవపడ్డ యువకుడు మనస్థాపంతో తుపాకీతో కాల్చుకొని ప్రాణం తీసుకున్నాడు. దైనిక్ జాగరణ్ మీడియా కథనం ప్రకారం.. జలంధర్కు చెందిన మానిక్ అనే యువకుడు బీ.కామ్ చదువుతున్నాడు. గతేడాది పబ్జీ ఆడడం అతనికి అలవాటైంది. కొద్ది రోజుల్లోనే ఆ ఆటకు అతను బానిసయ్యాడు. ఇంట్లో, కాలేజీలో, రోడ్డు మీద.. ఇలా ఎక్కడ ఉన్నా పబ్జీలోనే మునిగిపోయేవాడు.
దీంతో చదవడం తగ్గి మార్కులు బాగా తక్కువగా వచ్చాయి. విషయం మానిక్ తండ్రికి తెలియడంతో కోపంతో అతని స్మార్ట్ ఫోన్ పగలకొట్టాడు. ఐనా మానిక్ పబ్జీ ఆడకుండా ఆగలేకపోయాడు. తండ్రి ఫోన్ లోనే పబ్జీ ఆడడం ప్రారంభించాడు. ఈ విషయంలో తండ్రీకొడుకుల మధ్య నిరంతరం గొడవలు జరుగుతూనే ఉండేవి. ఈ క్రమంలో ఆదివారం ఇద్దరి మధ్య పెద్ద పంచాయితీ అయ్యింది. ఈ సారి మరింత పబ్జీ ఆడొద్దని మానిక్ ను సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. పరుష పదజాలంతో దూషించాడు. దీంతో మానిక్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూలేని సమయంలో తండ్రి లైసెన్స్డ్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.