ఆన్ లైన్ గేమ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మద్దికెర గ్రామానికి చెందిన మహేష్ కు 29 సంవత్సరాలు. ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్ లో మెడికల్ రిప్రజెంటెటివ్ గా పని చేస్తున్నాడు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ దగ్గర్లో ఉన్న ఓ హస్టల్ లో ఉంటున్నాడు.
ఆన్ లైన్ లో గేమ్ ఆడండి ఈజీగా డబ్బు సంపాదించండి అనే మెసేజ్ తన ఫోన్ కు రెగ్యూలర్ గా వస్తుండడంతో ఆ లింక్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డాడు. అలా రూ.7 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులు తీర్చాలని ఒత్తిడి రావడంతో మహేష్ కు ఏం చేయాలో పాలుపోలేదు. ఆర్దిక ఇబ్బందులతో తాను చనిపోతున్నానని లేఖ రాసి ఆదివారం మహేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ లెటర్ లో తాను ఎవరెవరికి అప్పు ఉన్నానో అన్న వివరాలు కూడా రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.