ఎన్ని విమర్శలు వస్తున్నా.. ఎంతో మంది అధికారులపై చర్యలు తీసుకుంటున్న రెవెన్యూ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తహసీల్దార్ జయరాం నాయక్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. రైతు బతికి ఉండగానే చనిపోయినట్లు రికార్డులు సృష్టించి అతడి పేరు మీద ఉన్న భూమిని వేరే వారికి పట్టా మార్పిడి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. వివరాల ప్రకారం.. కాసాలకు చెందిన కొట్టంలా పెంటయ్య అనే రైతు పేరు మీద 1 ఎకరా 17 గుంటల భూమి ఉంది. ఈ భూమిని హత్నూర మండలం తహసీల్దార్ జయరాం నాయక్ కొట్టంలా పెంటయ్య ను చనిపోయినట్లు రికార్డులు సృష్టించి వేరే వారి పేరు మీద పౌతి మార్పిడి చేశారని బాధితులు ఆరోపించారు. బాధిత కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. జిల్లా కలెక్టర్ కు తహసీల్దార్ జయరాం నాయక్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.