కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా విద్య, ఉపాధి రంగాలు కోలుకోలేకుండా అయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించేందుకు ది అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం/ తులిప్ పేరుతో ప్రత్యేక పోర్టల్ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించనుంది. తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారెవరైనా ఈ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) ద్వారా దీన్ని ప్రవేశపెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులకు పనిచేసే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం 23970 సంస్థల్లో దాదాపు మూడు లక్షల ఇంటర్న్షిప్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. తులిప్ 2025 సంవత్సరం నాటికి కోటి ఇంటర్న్షిప్స్ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గ్రాడ్యుయేషన్ స్థాయిలో బీటెక్, బీఆర్క్, బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, ఎల్ఎల్బీ తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యి 18 నెలలలోపు వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.