తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లగా మారింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వానలతో ఉక్కుపోత తగ్గి ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. రానున్న 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కంది. ఉత్తరమధ్య కర్ణాటక పరిసరాల్లోనూ ఉపరితల ఆవర్తనం నెలకొంది. ఈ ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు . తెలంగాణలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బుధ, గురువారాల్లో కూడా చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.