కరోనా రాకముందు వరకూ మన దేశంలో మాస్కులు, శానిటైజర్ల వాడకమే లేదు. డాక్టర్లు మాత్రమే వాటిని ఆపరేషన్ థియేటర్లలో వాడేవాళ్లు. కరోనా రాగానే ఒక్కసారిగా ప్రజలు మాస్కులు, శానిటైజర్లను పెద్ద సంఖ్యలో కొన్నారు. ఫిబ్రవరి, మార్చిలో వాటి ఉత్పత్తే సరిగ్గా లేదు. ఆ టైంలో వాటిని చాలా మంది బ్లాక్ మార్కెట్లలో అమ్మారు. కొందరైతే సందుల్లో తయారుచేసిన శానిటైజర్లకు స్టిక్కర్లు అంటించి వ్యాపారం చేశారు. ఇప్పుడు మాస్కులు, శానిటైజర్ల వాడకం తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మాస్కులు, శానిటైజర్లను కేంద్రం అత్యవసర వస్తువుల జాబితాలో ఉంచింది. తాజాగా ఆ జాబితా నుంచి వీటిని తొలగించడంతో వీటి ధరలకు రెక్కలు రాబోతున్నాయి. అత్యవసర వస్తువుల జాబితా నుంచి తొలగిస్తే వాటిని తయారు చేసే కంపెనీలు తమకు నచ్చిన ధరలకు వాటిని అమ్ముకునే వీలు కలుగుతుంది. దీంతో త్వరలోనే మాస్కుల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం రానుంది.