ఏపీ సీఎం జగన్ స్పందన కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వారు కావాలని ఇళ్ల పట్టాల భూముల పై కేసులు వేశారన్నారు. కరోనా కారణంగా కేసులు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. డీ పట్టాల కింద ఇవ్వాలనుకుంటే ఈ రోజైనా ఇళ్ల పట్టాల పంపిణీ చేయవచ్చని కానీ అలా తాము చేయాలనుకోవడం లేదన్నారు. ప్రైవేటు భూముల కొనుగోలుకే సుమారు రూ.7500 కోట్లు ఖర్చుచేశామని అన్నారు. మొత్తంగా దాదాపు రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30 లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నామన్నారు.30 లక్షల మందిని ఇళ్ల యజమానులుగా చేయబోతున్నామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాలు, ఇసుక, ఉపాధి హామీ పనులు, కోవిడ్-19 నియంత్రణ చర్యలు, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన చర్చించారు. టీడీపీ వారు ఎన్ని కుయుక్తులు పన్నినా చివరికి ధర్మమే గెలుస్తుందని సీఎం జగన్ అన్నారు. ఆగష్టు 15నాడు ఖచ్చితంగా ఇండ్ల పట్టాల పంపిణీ చేస్తామన్నారు.