కూతురు స్నేహితురాలు అని ఇంట్లోకి రానివ్వడమే ఆమె చేసిన పాపంగా మారింది. ఆ మహిళను నమ్మడమే వారు చేసిన నేరమైంది. స్నేహితురాలు తల్లి అని కూడా చూడకుండా ఆ కిలాడి ఏకంగా రూ. 57 లక్షలు ఎత్తుకెళ్లింది. సెంట్రల్ ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితులను పూజా, వరుణ్, అమిత్ డాబర్గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుష్ప అనే మహిళ తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురి స్నేహితురాలైన పూజపై అనుమానం ఉందని అనుమానం వ్యక్తం చేసింది.ఫ్లాట్ అమ్మగా వచ్చిన సొమ్మును ఇంట్లో దాచుకుంటే ఎత్తుకెళ్లిందని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పూజను ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. పుష్ప తను చేసిన నిజాన్ని ఒప్పుకుంది. 2017లో అందులోంచి రూ. 27 లక్షలు దొంగిలించి తన తమ్ముళ్లకు ఇచ్చి వారి చేత ఫ్లాట్ కొనిపించినట్లు చెప్పింది. ఇటీవల పూజ మరోసారి పుష్ప ఇంటికి వెళ్లిమరో రూ. 30 లక్షలు దొంగిలించినట్లు చెప్పింది. పోలీసులు నిందితుల నుంచి రూ. 29.43 లక్షలు, మరో రూ. 25 లక్షల విలువైన ఓ ఫ్లాట్, నగలను స్వాధీనం చేసుకున్నారు. అపరిచితులను అధికంగా నమ్మవద్దని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.