ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యం మత్తులో స్నేహితుడి గడ్డానికి నిప్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 05, 2020, 10:30 AM

మద్యం మత్తులో రాజకీయనాయకులైన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఓ గొడవ హత్యాయత్నానికి దారితీసింది. యాదాద్రిభువనగిరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. యాదాద్రిభువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారం మాజీ ఎంపీటీసీ, ఆర్ఎంపీ డాక్టర్ సకినాల సత్యానారాయణ, జాలా గ్రామానికి చెందిన ఓ పార్టీ నాయకుడు ఠాకూర్ ప్రమోద్ సింగ్ ఇద్దరు స్నేహితులు. సత్యనారాయణ నాలుగు సంవత్సరాల క్రితం ఎంపీటీసీగా పనిచేశారు. ఆ సమయంలోనే ప్రమోద్ సింగ్ భార్య సైతం జాల గ్రామ ఎంపీటీసీగా ఉన్నారు. ఈ రెండు గ్రామాలు పక్కపక్కనే ఉండడంతో ఇద్దరు స్నేహితులుగా మారారు. బుధవారం రాత్రి జాల గ్రామానికి ప్రమోద్ సింగ్, ఎర్రోల సత్యనారాయణ మద్యం తాగేందుకు సకినాల సత్యనారాయణను జాల గ్రామ సమీపంలోని మైసమ్మగుడి దగ్గరకు రమ్మన్నారు.అక్కడికి చేరిన సత్యనారాయణను మద్యం తాగాలని ఒత్తిడి చేయడంతో అతడు నిరాకరించాడు. ‘అప్పట్లో మనం మద్యం తాగాం. ఇప్పుడు ఎందుకు తాగవు. ఈ గడ్డం, కాషాయ బట్టలు ఎందుకంటూ లాగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో సత్యనారాయణ పెంచుకున్న గడ్డంపై ప్రమోద్ సింగ్ మద్యం పోసి అగ్గిపుల్లతో నిప్పు అంటించాడు. దీంతో సత్యనారాయణ మొహాం కొంచెం కాలిపోయింది. దీంతో అతడు చనిపోయాడని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో సత్యనారాయణ గ్రామానికి వెళ్లి, తనపై జరిగిన దాడి గురించి గ్రామస్తులకు తెలిపి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటికే నిందితులు ఇద్దరూ పరారీ అయ్యారు. హత్యాయత్నం కింద ఇద్దరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com