ప్రభుత్వాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా, ఎన్ని కొత్త చట్టాలు తెస్తున్నా మహిళలపై దారుణాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ముంబై మహానగరంలో మరో ఘోరం చోటు చేసుకుంది. షాపులోకి వచ్చిన ఓ మహిళను నిర్వాహకుడు గొంతుకోసి దారుణంగా చంపి, మహిళ శవంతో గడిపాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ముంబై నగరంలోని నలసోపారాకు చెందిన ఓ 25 ఏళ్ల మహిళ జూన్ 26న కిరాణ సామగ్రి కోసం బయటకు వెళ్లింది. ఈ క్రమంలోనే తన పిల్లలకు బొమ్మలు కొనేందుకు ఓ బొమ్మల దుకాణంలోకి వెళ్లింది. ధర విషయంలో మహిళకు, దుకాణ యాజమానితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో దుకాణ యజమాని మహిళను జుట్టు పట్టుకని దుకాణం వెనుక ఉన్న గదిలోకి లాక్కెళ్లాడు. మహిళ అరవడంతో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం శవంపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం మహిళ మృతదేహాన్ని ఓ వ్యానులో ఎక్కించి రోడ్డు పక్కన ఆపి వెళ్లిపోయాడు.మహిళ ఎంతకూ తిరిగి రాకపోవడంతో పాలు అమ్ముకుని జీవించే ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనం నుంచి వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం విచారణ నిర్వహించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.