ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 04, 2020, 03:24 PM

ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి పండితులు ఓ ముహూర్తం సూచించారు. జూలై 22వ తేదీన కేబినెట్ విస్తరణ ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలిసింది. అంటే శ్రావణమాసం వచ్చిన తర్వాత రోజు. ప్రస్తుతం ఆషాఢ మాసం. ఈ సమయంలో కొత్త పనులు చేపట్టరు. శ్రావణమాసంలో శ్రీకారం చుడతారు. పండితుల సూచన మేరకు జూలై 22న శ్రావణమాసం వచ్చిన తర్వాత రోజే కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఏపీ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో వారి స్థానంలో ఇద్దరు కొత్త మంత్రులను తీసుకోనున్నారు. వారిద్దరూ బీసీ సామాజిక వర్గానికే చెందిన వారు కావడంతో కొత్త మంత్రులు కూడా బీసీలకే ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీలు. అయితే, ఈసారి ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలకే జగన్ కేబినెట్‌లో అవకాశం కల్పించనున్నారు.
ముమ్మిడివరం ఎమ్మెల్యే పి. సతీష్ మత్స్యకార వర్గానికి చెందిన ఎమ్మెల్యే. మోపిదేవి కూడా అదే సామాజికవర్గం కావడంతో ఆ ఖాళీని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సతీష్‌తో భర్తీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు వైసీపీ వర్గాల నుంచి సమాచారం. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానం కోసం గట్టి పోటీ ఉంది. మాజీ మంత్రి కొలుసు పార్థసారధి, జోగి రమేష్ ఆ స్థానం కోసం పోటీ పడుతున్నారు. అయితే, వారిద్దరూ కృష్ణా జిల్లాకే చెందిన వారు. జోగి రమేష్.. పిల్లి సుభాష్ చంద్రబోస్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. కానీ, కృష్ణా జిల్లా నుంచి ఇప్పటికే ముగ్గురు మంత్రులు (కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని) ఉన్నారు. మరో వ్యక్తికి ఛాన్స్ దొరుకుతుందా అంటే అనుమానమే.మంత్రి ధర్మాన కృష్ణదాస్ సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రిపదవి ఆశిస్తున్నారు. గుంటూరు జిల్లాకు నరసరావుపేట ఎమ్మెల్యే విడదల రజిని కూడా సీఎం జగన్ కుటుంబసభ్యుడు, ఇటీవల జిల్లా ఇన్ చార్జి కూడా అయిన ఓ కీలక రెడ్డి నేత ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. విశాఖ జిల్లాకు చెందిన మరో బీసీ ఎమ్మెల్యే బి.ముత్యాల నాయుడు, సిదిరి అప్పలరాజు పేర్లు కూడా కేబినెట్ బెర్త్ మీద ఆశలు పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీసీలకే ఇవ్వాలని జగన్ భావిస్తున్నా.. తమ లక్ కూడా పరీక్షించుకోవాలని కొందరు ఇతర సామాజికవర్గ ఎమ్మెల్యేలు కూడా ఆశలు పెట్టుకున్నారు. వారిలో అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వారు కూడా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com