అనంతపురం జిల్లాలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గత కొద్దిరోజులుగా జిల్లా ప్రజలను హడలెత్తిస్తోంది. జిల్లా వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా జిల్లాలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు భయంతో హడలిపోతున్నారు. మెున్నటి వరకు కరోనా దెబ్బకు పట్టణాలన్నీ వణికిపోయాయి. తాజాగా కరోనా దెబ్బకు పల్లెటూర్లు సైతం వణికిపోతున్నాయి. గత 24 గంటల్లో జిల్లాలో 104 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దాంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1571కి చేరుకున్నాయి.
ఇకపోతే జిల్లాలో 648మంది ఐసోలేషన్ వార్డులో చికిత్సపొందుతుండగా915 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా మహమ్మారి బారినపడి ఏడుగురు మృత్యువాత పడగా తాజాగా మరోకరు మృతి చెందారు. దాంతో జిల్లాలో కరోనా బారినపడి చనిపోయిన వారి సంఖ్య 8కి పెరిగింది. ఇకపోతే జిల్లాలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ను కఠినంగా అధికారులు అమలు చేస్తున్నారు.