ఇండియా పేరును భారత్ లేదా హిందూస్థాన్గా మార్చాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో తాము కలగజేసుకోలేమని కేంద్రమే నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. పేరు మార్పునకు సంబంధించి కోర్టును ఆశ్రయించడం కన్నా పిటిషన్ కాపీని హోం మంత్రిత్వశాఖకు ఇవ్వాలని పిటిషనర్కు సుప్రీంకోర్టు సూచించింది. ఆ శాఖ పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఒకవేళ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే దేశం పేరును మార్చే వీలుంటుందని అభిప్రాయపడింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఇండియా అనే పేరును మార్చి భారత్ లేదా హిందుస్తాన్గా పిలిచేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో సవరణలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భారత్ అనే పేరును హిందుస్తాన్గా మార్చడం వల్ల దేశ ప్రజలు గతంలో తాము మరొకరి పాలనలో ఉన్నామనే భావన నుంచి బయటపడతారని పిటిషనర్ పేర్కొన్నారు. ‘ఇంగ్లీష్ పేరును తొలగించి ఆ స్థానంలో ప్రతీకగా భావించే మరో పదం చేర్చడం వల్ల దేశ ప్రజల్లో ఆత్మగౌరవం, జాతీయతా భావం పెరుగుతుంది. ఓ రకంగా ఇండియా అనే పేరును తీసేసి అక్కడ భారత్ అనే పేరు చేర్చడం వల్ల స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని గుర్తు చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది.’ అని పిటిషన్లో పేర్కొన్నారు.