నిసర్గ తుఫాను మహారాష్ట్ర, గుజరాత్ లో బీభత్సం సృష్టిస్తోంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరం దగ్గర ఉన్న హరిహరేశ్వర్ దగ్గర్లో అది తీరం దాటింది. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సాయంత్రం 4 గంటల సమయానికి తుఫాను పూర్తిగా తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు ఈదురు గాలులు వీస్తున్నాయి. అక్కడి వాతావరణం అల్లకల్లోలంగా ఉంది. ఈ తుఫాను వల్ల ముంబై, పాల్ఘర్, థానే, రాయ్గఢ్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు జూన్ 4 వరకూ పడతాయని అంచనా వేశారు. అలాగే రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలో భారీ వర్షాలు పడుతాయని, ఇక గోవా, దక్షిణ గుజరాత్, డమన్, దాద్రా నగర్ హవేలీలో వచ్చే 24 గంటలపాటూ వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.తుఫాను వల్ల తీర ప్రాంతం వర్షంతో అల్లకల్లోలంగా ఉండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసింది. కేంద్రం కూడా చాలా అప్రమత్తంగా ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండ్రోజులుగా సహాయ కార్యక్రమాల్లో ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, దాద్రానగర్ హవేలీ, డయ్యూ డమన్కి 33 బృందాలు వెళ్లాయి. ఒక్కో బృందంలో 45 మంది ఉన్నారు. అందరూ తుఫాను వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.