జగన్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల విషయంలో దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కొట్టేసింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ భవనాలకు రంగులు తొలగించాలని ఆదేశించింది. రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసింది వైఎస్సార్సీపీ జెండా రంగులు కాదని ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించే ప్రయత్నం చేసింది. అయితే కోర్టు మాత్రం తోసిపుచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీ రంగులు వేయవద్దని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తాము గతంలోనే ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం పాటించడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 623ను కూడా కొట్టి వేసింది. ఈ నెల 28లోగా వివరణ ఇవ్వాలని సీఎస్, పంచాయతీశాఖ కార్యదర్శిని ఆదేశించింది. లేకపోతే కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.