దేశంలో లాక్ డౌన్ పరిస్థితులు నెలకొన్న సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తాజాగా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి, ఏప్రిల్ నెలకు సంబంధించి చెల్లించాల్సిన మొత్తం ఆలస్యమైతే పెనాల్టీ ఉండదని ప్రకటించింది. పలు స్మాల్ సేవింగ్ స్కీమ్స్కు ఇది వర్తిస్తుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ తాజా నిర్ణయంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), రికరింగ్ డిపాజిట్స్ (ఆర్ డి), సుకన్య సమృద్ధి అకౌంట్ వంటి పలు స్కీమ్స్లో చేరిన వారికి ప్రయోజనం కలుగనుంది. జూన్ 30 వరకు పెనాల్టీలను మినహయిస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ పేర్కొంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఆర్డీ, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి వాటికి చెందిన సబ్స్క్రైబర్లు 2019-20 ఆర్థిక సంవత్సరం లేదా ఏప్రిల్ నెలకు సంబంధించిన డిపాజిట్ మొత్తాన్ని జూన్ 30లోగా కట్టేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఎలాంటి పెనాల్టీలు కానీ, ఫీజులు కానీ పడవు. పీపీఎఫ్ అకౌంట్లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 అయినా డిపాజిట్ చేయకపోతే అప్పుడు ఆ అకౌంట్ ఇన్యాక్టివ్ అవుతుంది. ఈ అకౌంట్ను మళ్లీ యాక్టివ్ చేసుకోవాలంటే రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఆర్డీ అకౌంట్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే డిఫాల్ట్ ఫీజు పడుతుంది. సుకన్య సమృద్ధి అకౌంట్ విషయానికి వస్తే.. ఈ అకౌంట్లో కూడా కనీసం కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అకౌంట్లో సంవత్సరానికి కనీసం రూ.250 ఇన్వెస్ట్ చేయాలి.