(కోవిడ్-19)పై పోరాటానికి భారత్కు ఆర్ధిక సాయానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ముందుకొచ్చింది. కరోనాపై పోరాటానికి పూర్తిగా సహకరిస్తామని భరోసా ఇచ్చిన ఏడీబీ అధ్యక్షుడు మాసాట్సుగు అసకావా.. 2.2 బిలియన్ డాలర్లు (రూ.16,500 కోట్లు) అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్కు శుక్రవారం తెలియజేశారు. నిర్మలా సీతారామన్తో ఫోన్లో మాట్లాడిన ఏడీబీ ఛైర్మన్.. కరోనా వైరస్ మహమ్మారిని కట్టడిచేయడానికి భారత్ చేపట్టిన చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
జాతీయ ఆరోగ్య అత్యవసర ప్రోగ్రామ్, పన్నులు, వ్యాపార సంస్థలకు ఇతర పునరావాస చర్యలు, మూడు వారాల లాక్డౌన్ వల్ల నిరుపేదలు, మహిళలు, రోజువారీ, వలస కూలీలకు ఇబ్బందులు లేకుండా వారి సంక్షేమం కోసం మార్చి 26న ప్రకటించిన రూ.1.7 లక్షల కోట్ల ప్యాకేజీ గురించి కూడా అసవాకా ప్రస్తావించారు. ‘భారత అత్యవసర అవసరాలకు మద్దతు ఇవ్వడానికి ఏడీబీ కట్టుబడి ఉంది. ఆరోగ్య రంగానికి 2.2 బిలియన్ డాలర్ల తక్షణ సహాయాన్ని సిద్ధం చేస్తున్నాం.. పేదలు, అసంఘటిత రంగ కార్మికులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు, ఆర్థిక రంగంపై మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడతాం’అని హామీ ఇచ్చారు.
అలాగే, ప్రయివేట్ రంగానికి ఆర్ధిక సాయం అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే ఈ రంగంపై దృష్టిసారించామని ఏడీబీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు, ఒకవేళ అవసరమైతే ఏడీసీ సాయం మరింత పెంచుతామని, భారత అవసరాలను తీర్చడానికి మా వద్ద అందుబాటులో ఉన్న అన్ని వనరులను పరిశీలిస్తాం, వాటిలో అత్యవసర సహాయం, పాలసీ ఆధారిత రుణాలు, నిధులు వేగంగా పంపిణీ చేయడానికి బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని ఏడీబీ ఛైర్మన్ స్పష్టం చేశారు.
భారత వాణిజ్య, ఉత్పత్తి సరఫరా సహా పర్యాటకం, ఇతర ఆర్దిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటంతో ప్రపంచ ఆర్ధికవృద్ధి మందగించింది. పెద్ద సంఖ్యలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలలో ఉత్పత్తి నిలిచిపోవడంతో అనేక మంది ప్రజలు జీవనోపాధికి ముప్పు ఏర్పడింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పేదలు, వ్యాపార సంస్థలకు ఎంతో ఉపశమనం కలిగించాయని, వేగంగా కోలుకోవడానికి ఒక ఆధారం అవుతుందని అసకావా అన్నారు. ఆభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి సభ్యదేశాలకు 6.5 బిలియన్ డాలర్ల అత్యవసర ప్యాకేజీని మార్చి 18న ఏడీబీ ప్రకటించింది. అంతేకాదు, కరోనా వైరస్ను ఎదుర్కొడానికి ఆర్ధికంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.