ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ నిబంధనలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ సామాజికదూరం పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాజకీయనాయకులకు ప్రత్యేకించి ఈ లాక్ డౌన్ నిబంధనలు పాటించేలా చూడాలని, ప్రజాప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు అందరూ లాక్ డౌన్ నిబంధనలు స్పష్టంగా ఆచరించేలా చూడాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సామూహిక సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం మేలని అభిప్రాయం వ్యక్తంచేసింది. విశాఖ జిల్లా చోడవరంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు నిర్వహించిన సమీక్ష సమావేశంలో సామాజిక దూరం పాటించలేదంటూ న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టుకు లేఖ రాశారు. ఆ లేఖపై హైకోర్టు విచారణ జరిపింది.
లాక్ డౌన్ నిబంధనలు ఉన్నా కూడా కొందరు ప్రజలు, ప్రజాప్రతినిధులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ ప్రజాప్రతినిధి సుమారు 50 మందిని వెంట వేసుకుని ఓ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వెళ్లారు. అయితే, ఎమ్మెల్యే వెనుక వచ్చి వారంతా గుంపులుగానే తిరిగారు. ఎవరూ సామాజిక దూరం పాటించలేదు. చాలా మంది కనీసం ముఖానికి మాస్క్లు కూడా వేసుకోలేదు. దీనిపై మీడియా వార్తలు ప్రసారం చేసింది. అయితే, సదరు ఎమ్మెల్యే ఏకంగా మీడియా వారి మీదే తిట్ల దండకం అందుకున్నారు.