లాక్ డౌన్ తో బయట కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంటే.. వాటికి పోటీగా ఇళ్లల్లో కొందరు మహిళలపై వేధింపులు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి. పొద్దంతా ఇళ్లల్లోనే ఉంటున్న కొందరు మగాళ్లు మృగాలుగా మారి భార్యలను చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. దీంతో ఇంట్లో కంటే బయటనే తమకు ప్రశాంతంగా ఉంటుందంటూ కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉంటున్న ఆడవారిపై గృహ హింసకు పాల్పడుతున్న పురుషులను పట్టుకునేందుకు ఎర్ర చుక్క ఉపయోగపడుతోంది. అర చేతిలో రెడ్ డాట్ (ఎర్ర చుక్క)ను చూపిస్తూ మెయిల్ చేస్తే, బాధితురాలు ఉన్న ప్రాంతానికి పోలీసులు చేరుకునేలా వెఫ్ట్ అనే ఫౌండేషన్ ఈ పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఎర్ర చుక్కను సోషల్ మీడియా ద్వారా గానీ, ఈ మెయిల్ weftinfo@gmail.com ద్వారా చూపించడం లేదా 181 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయడం ద్వారా గానీ గృహ హింస జరుగుతోందని అధికారులకు తెలియజేయవచ్చని వెఫ్ట్ ఫౌండేషన్ ను ప్రారంభించిన రావత్ తెలిపారు. ఇప్పటి వరకు తమకు 20కి పైగా ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. కొల్ కత్తా నుంచి తమకు వచ్చిన ఫిర్యాదు గురించి ప్రస్తావిస్తూ..లాక్ డౌన్ ప్రారంభం నుంచి ఉద్యోగం లేక ఇంట్లో ఉంటున్న ఓ భర్త భార్యను చిత్ర హింసలకు గురిచేస్తున్నాడనన్నారు. ఆమె దాచుకున్న డబ్బులను దాచుకొని కుమారుడి ముందే దూషించాడన్నారు. దీంతో తట్టుకోలేక బాధితురాలు తమకు ఫిర్యాదు చేసిందన్నారు. బాధితురాలికి అన్ని విధాలుగా తాము అండగా ఉన్నట్లు చెప్పారు. దాదాపు 68 మంది బాధితులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు రావత్ తెలిపారు. ఎర్ర చుక్క గుర్తును ప్రపంచ వ్యాప్తం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జాతీయ మహిళా కమిషన్, ఐరాస మహిళా విభాగంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.