ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం 192 మందికి కరోనా వైరస్ సోకినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో... అక్కడ 144 సెక్షన్ విధించారు. ఐతే... ఇదే అంశంపై 3 గ్రామాల ప్రజల మధ్య గొడవ మొదలైంది. తమ గ్రామాల్లోకి వేరే గ్రామాల ప్రజలు రావొద్దంటూ... లక్ష్మీపురం, కొత్తూరు, విడవలూరు ప్రజలు... ఎవరికి వాళ్లు కంచెలు వేసుకున్నారు. ఐతే... ఇలా కంచెలు వెయ్యడమేంటని... కొందరు వ్యతిరేకించారు. అలా మొదలైన గొడవ మూడు గ్రామాల మధ్యా అంతకంతకూ పెరిగింది. చివరకు వాళ్లంతా రాళ్ల దాడి చేసుకొని కొట్టుకునేంత పరిస్థితి వచ్చేసింది. ఈ దాడిలో కొందరికి గాయాలయ్యాయి. అసలీ కంచెలు వేసుకున్నది కరోనా వైరస్ రాకూడదన్న ఉద్దేశంతోనే. ఒక గ్రామం ప్రజలు మరో గ్రామానికి వస్తే... తమ గ్రామానికి వైరస్ సోకుతుందేమో అన్న ఉద్దేశంతో ఎవరికి వాళ్లు కంచెలు వేసుకున్నారు. తీరా గొడవ మొదలయ్యాక... అంతా అల్లకల్లోలం అయిపోయింది. సోషల్ డిస్టాన్స్ అనేది అంతా మర్చిపోయారు. గుంపులుగా సరిహద్దులకు వెళ్లి... రాళ్ల దాడి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్లలో ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే... ఇలా గుంపుగా అందరూ వెళ్లడం వల్ల మిగతా వారికీ అది సోకే ప్రమాదం ఉంటుంది. ఇలా కరోనా వైరస్... ఊళ్ల మధ్య చిచ్చు రేపుతోంది.