ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతుంది. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించింది. ఏప్రిల్ 14 వరకు కేంద్ర సర్కార్ లాక్ డౌన్ విధించింది. ప్రస్తుతం భారత్ లో కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో లాక్ డౌన్ పొడిగిస్తారా లేదా అనే దాని పై అనుమానాలున్నాయి. అయితే రైళ్ల ప్రారంభం పై గత కొద్ది రోజులుగా విభిన్న వార్తలు వస్తున్నాయి. వాటన్నింటికి చెక్ పెడుతూ రైల్వేశాఖ నేడు కీలక ప్రకటన చేసింది. "లాక్ డౌన్ తర్వాత నుంచి రైళ్లు నడిపే అంశంపై రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ప్రయాణికుల రైళ్లను పునరుద్ధరించే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనను రైల్వేశాఖ జారీ చేయలేదు. దీనికి సంబంధించిన ఏ విషయమైనా రైల్వే శాఖ సంబంధిత వర్గాలకు ముందుగా తెలియజేస్తుంది." అంటూ రైల్వే శాఖ ట్వీట్ చేసింది. లాక్ డౌన్ పై ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా రైళ్ల ప్రారంభం పై నిర్ణయం తీసుకుంటామని రైల్వే శాఖ ఉన్నతాధికారి తెలిపారు. ఏప్రిల్ 15 తర్వాత రైళ్లు నడిచేది లేనిది ఏప్రిల్ 14నే తెలియజేస్తామన్నారు. అప్పటి వరకు రైళ్ల ప్రారంభం పై వచ్చే పుకార్లు నమ్మవద్దని వారు కోరారు.