తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో కరోనా రెండు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఆ కేసులు గుర్తించబడిన బ్యాంకు పేట ప్రాంతాన్ని రెవెన్యూ యంత్రాంగం రెడ్ జోన్ గా ప్రకటించింది.ఆ ఏరియా చుట్టుపక్కల 500 మీటర్ల పరిధిలో పూర్తిగా కంపార్ట్మెంట్ స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. లోపలికి బయటికి ఏ ఒక్కరు వెళ్లేందుకు అనుమతించరు. కేవలం వైద్యసేవలు, పారిశుద్ధ్యం, ఇతర అత్యవసర సేవల కోసం మాత్రమే అన్ని జాగ్రత్తలతో పంపుతారు. జిల్లా కేంద్రం కాకినాడలో రెడ్ జోన్ ప్రకటించడంతో నగర ప్రజలు భయంతో వణికిపోతున్నారు. నిజాముద్దీన్ లో ప్రయాణించిన వ్యక్తి కి కరోనా తో అతని ద్వారా అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి, పిఠాపురానికి చెందిన వ్యక్తికి ఈ వైరస్ సోకింది. దీంతో బ్యాంకు పేట మొత్తం ఉలిక్కి పడుతోంది. రెవెన్యూ, పోలీస్, మునిసిపల్, పంచాయతీరాజ్ ,వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు.