కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కబళిస్తోంది. ఇప్పటి వరకు 42వేల మందిని బలితీసుకుంది. ఐతే కరోనా మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి.. బీపీ, గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారే చనిపోతున్నారని మొన్నటి వరకూ అనుకున్నాం. కానీ పరిస్థితులు మారుతున్నాయి. రోజు రోజుకూ చేదాటిపోతున్నాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న యువకులు కూడా కరోనా బారినపడి చనిపోతున్నారు. వారికి ఇంతకు ముందు ఎలాంటి వ్యాధులు లేవు. కేవలం కరోనా సోకడం వల్లే కన్నమూస్తున్నారు. యూపీలో తొలి కరోనా మరణం కూడా ఇలాంటిందే. బస్తి జిల్లాకు చెందిన 25 ఏళ్ల యువకుడు కరోనాతో మరణించాడు. ముంబై, హైదరాబాద్లో పర్యటించిన అనంతరం అతడికి కరోనా సోకింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు.ఇదొక్కటే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పిల్లలు, యువకులు కూడా కరోనా కాటుకు బలవుతున్నారు. బ్రిటన్లో 13 ఏళ్ల బాలుడు కరోనా మహమ్మారి బారినపడి చనిపోయాడు. అతడికి గతంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెప్పారు. మంగళవారం ఉదయం బెల్జియంలో 12 ఏళ్ల బాలిక మరణించింది. ఫ్రాన్స్లోనూ 18 ఏళ్ల యువకుడు కరోనాతో కన్నుమూశాడు. ఈ నేపథ్యంలో కేవలం వృద్ధులే కాదు... యువత కూడా కరోనా కాటుకు బలవుతోందని స్పష్టమవుతోంది. కరోనా ప్రభావంతో ఊపిరితిత్తులను నాశనమవుతాయి. అనంతరం శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడి.. ఊపిరాడక చనిపోతారు. ఇప్పటి వరకు చనిపోయిన మృతుల్లో చాలా కేసులో ఇలానే జరిగింది. అందుకే యువత.. బీ కేర్ఫుల్..! మనకేం కాదనే నిర్లక్ష్యం వద్దు. ప్రభుత్వం చెప్పటినట్లుగా వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ.. సామాజిక దూరం మెయింటేన్ చేయాలి. అదే మనకు శ్రీరామరక్ష.