భారత్లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మంగళవారం ఒక్కరోజే 300 కంటే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇంత భారీ స్థాయిలో ఒకే రోజు కరోనా కేసులు పెరగడం ఇదే తొలిసారి. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను ఓ సారి గమనిస్తే మార్చి 24 న దేశంలో 529 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆ సంఖ్య మార్చి 31 నాటికి 1649కి చేరింది. అంటే, వారం రోజుల్లో మూడింతలు పెరిగింది. అంటే, దీని ఉద్దేశం లాక్ డౌన్ విఫలం అయ్యిందని కాదు. ప్రస్తుతం బయటపడిన కేసులన్నీ లాక్ డౌన్కు ముందు కరోనా సోకిన కేసులు. 14 రోజుల తర్వాత బయటపడుతున్నాయి. ఒకవేళ లాక్ డౌన్ ప్రకటించకపోయి ఉంటే ఈ కేసుల సంఖ్య ఏ రేంజ్లో ఉండేదో ఊహించుకోవచ్చు. గత మూడు రోజుల్లో (మార్చి 28 నుంచి మార్చి 31 వరకు) 740 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదైంది. అంటే, మంగళవారం నాటికి నమోదైన మొత్తం 1649 కేసుల్లో 45శాతం కేసులు గత మూడు రోజుల్లోనే పెరిగాయన్నమాట. కేసులు ఎక్కువగా పెరుగుతున్న ప్రాంతాలను ‘హాట్ స్పాట్స్’గా గుర్తిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఇలాంటి 10 హాట్ స్పాట్స్ను గుర్తించింది.
1. నిజాముద్దీన్ (ఢిల్లీ)
2. దిల్షద్ (ఢిల్లీ)
3. నోయిడా (యూపీ)
4. మీరట్ (యూపీ)
5. బిల్వారా (రాజస్థాన్)
6. అహ్మదాబాద్ (గుజరాత్)
7. కసర్గఢ్ (కేరళ)
8. పట్టణంతిట్ట (కేరళ)
9. ముంబై (మహారాష్ట్ర)
10. పుణె (మహారాష్ట్ర)