దేశమంతా లాక్డౌన్ కొనసాగుతోంది. కరోనా కట్టడికి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
ఐతే కొందరు మాత్రం లాక్డౌన్ ఆదేశాలను పట్టించుకోకుండా బయటకొస్తున్నారు. వాహనాలపై రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. అలాంటి వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. లాఠీలకు పనిచెబుతూ చితకబాదుతున్నారు.
ఈ క్రమంలో మధ్యప్రదేశ్కు చెందిన ఓ పోలీస్ అధికారి సోషల్ మీడియా వేదికగా ప్రజలను బెదిరించాడు. బయటకొస్తే కాల్చి పడేస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఆ మెసేస్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఈ సందర్భంగా ఉజ్జయినిలోని మహిద్పూర్ ప్రాంతంలో సంజయ్ వర్మ టిఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలు మీడియా సంస్థలు సభ్యులుగా ఉన్న వాట్సాప్ గ్రూప్లో ఓ సందేశం పంపాడు సంజయ్ వర్మ.
లాక్డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా బయటకు వస్తే.. సామాజిక దూరం పాటించకపోతే.. తాను కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. తాను స్నాప్ షూటర్ని అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని... తనకు రజత పతకం కూడా వచ్చిందని పేర్కొన్నారు.
అనంతరం తమ ఆదేశాలను పట్టించుకోకుంటే కేవలం 7 సెకన్లలోనే పని పూర్తిచేశానని ప్రజలను బెదిరించారు.
ఈ నేపథ్యంలో సంజయ్ వర్మ వాట్సాప్ మెసేజ్ వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సంజయ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ ఆయన్ను సస్పెండ్ చేశారు.