కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ లాక్డౌన్కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి గురువారం లేఖ రాశారు. ఆ లేఖలో సోనియా కరోనా వైరస్ లక్షలాదిమంది జీవితాలను ప్రమాదంలో పడేసిందన్నారు. కరోనా మహమ్మారిపై విజయానికి దేశం ఒక్కతాటిపై నిలిచి పోరాడాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ నివారణ చర్యలకోసం కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని సోనియా పేర్కొన్నారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశ వ్యాప్తంగా సరకు రవాణాను సులభతరం చేయాలని, బ్యాంకుల ఈఎంఐలను వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సోనియా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.