ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పథకాల అమలు విషయంలో చాలా దూకుడుగా వెళ్తున్నారు. ఏ ఒక్క సామాజికవర్గానికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అమ్మఒడి, జగనన్న వసతి ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. తాజాగా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవరత్నాలతో పాటు కార్పొరేషన్ల ద్వారా అన్ని వర్గాలకు చేయూతనిస్తున్న సర్కార్ మరో పథకానికి శ్రీకారం చుట్టింది. పేద బ్రహ్మణ కుటుంబాల్లో 7 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న ఉపనయనం ( ఒడుగు ) చేయించుకునే వారికి ప్రభుత్వం తరపున 15 వేల రూపాయాల ఆర్థిక సాయం అందించనున్నారు.
ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించాలని బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్ణయించింది. దీంతో వారికి ఆర్థిక చేయూత అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఇప్పటికే భారతి కార్యక్రమం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలు సాయం అందజేస్తున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఎవరైనా విదేశాలు వెళ్లాలని అనుకుంటే ఫిబ్రవరి 29 లోపు ఆన్లైన్లో అప్లే చేసుకోవాలని సూచించారు.