అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. మిల్వాకీ నగరంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని మిల్వాకీ నగరంలో మెల్సన్ కూర్స్ బీర్ల కంపెనీలో నిన్న సాయంత్రం జరిగింది. తనను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ వ్యక్తి తుపాకితో కంపెనీలోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు తనను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కంపెనీ ఉద్యోగి అయిన నిందితుడిని కొంతకాలం క్రితం సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది.
దీంతో కోపంతో రగిలిపోయిన అతడు సంస్థలో పనిచేస్తున్న మరో ఉద్యోగి ఐడీకార్డు దొంగిలించి సంస్థలోకి ప్రవేశించాడు. అనంతరం వెంట తెచ్చుకున్న తుపాకితో ఉద్యోగులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. కాల్పుల శబ్దం వినగానే ఉద్యోగులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఏం జరుగుతోందో తెలియక అయోమయానికి గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.