ఏపీలో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశం ఉందని తెలుస్తోంది. నెల రోజుల్లో స్థానిక, మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించిన తీర్పును హైకోర్టు రిజర్వ్ లో పెట్టింది. మరో వైపు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే పోలింగ్ కోసం పాఠశాల భవనాలను ఉపయోగించాల్సి ఉంది. దాంతో పాటు టీచర్లు కూడా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో పాటు మార్చి 4 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు, మార్చి 23 నుంచి ఏప్రిల్ 10 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల అధికారులు అంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే విద్యార్దులకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దానికి తోడు రిజర్వేషన్ల లెక్క కూడా తేలలేదు. కాబట్టి ఇప్పట్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉండవని తేలిపోయింది. ఏప్రిల్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి ఏప్రిల్ చివరి నాటికి ఎన్నికలు పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తునట్టు తెలుస్తోంది.