విశాఖపట్నం : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్న 108, 104 వాహనాల్లో పని చేసేందుకు అవసరమైన ఉద్యోగుల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలను బుల్లయ్య కళాశాలలో మంగళ, బుధవారాల్లో నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ ఇక్కడ చేపట్టనున్నారు. ఎంబీబీఎస్ అర్హతతో 200 మంది వైద్యుల పోస్టులు, ఎంబీఏ/ఇతర డిగ్రీ అర్హతతో 30 సూపర్ వైజర్ పోస్టులు, బీఎస్సీ నర్సింగ్, బీఎస్ లైఫ్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, జనరల్ నర్సింగ్ మిడ్వైఫ్ అర్హతతో 150 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(ఈఎంటీ), పదో తరగతి అర్హత, బ్యాడ్జితో కూడిన లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అర్హతతో 300 పైలెట్/డ్రైవర్ పోస్టులు, డిప్లొమా ఇన్ కంప్యూటర్స్/టైపింగ్ సామర్థ్యం కలిగిన డిగ్రీ అర్హతతో 50 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, మూడు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఎక్కడైనా పని చేసిన అనుభవం ఉంటే చివరి మూడు నెలల పేస్లిప్స్, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ఆధారాలను తీసుకుని రావాలి.