ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం ఏపీలో ప్రవేశపెట్టిన పథకానికే పేరు మార్చి జగనన్న వసతి దీవెన పేరుతో మళ్లీ కొత్తగా ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు. ఇది జగన్మాయే తప్ప కొత్త పథకం కాదని విమర్శలు గుప్పించారు. మాటల్లో తేనె ఉంటుందని, చేతల్లో కత్తెర ఉంటుందని విమర్శలు గుప్పించారు.
వైఎస్ జగన్ నైజం ఇదేనని యనమల అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను జగన్ తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న కంటి వెలుగు పథకం కూడా టీడీపీ తెచ్చిన పథకమేనని చెప్పారు. రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో 9 నెలల్లో రూ.22 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయనడం మోసమని ఆయన చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీల పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.