అమరావతి: నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనపై విచారణకు ఆదేశించామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అలసత్వం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ట్రిపుల్ ఐటీల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తామని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని సురేష్ పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థినుల హాస్టల్లోకి యువకుడు చొరబడిన విషయం తెలిసిందే. కిటికీ ఊచలు తొలగించి అమ్మాయిల గదిలోకి యువకుడు వెళ్లాడు. 12 గంటల పాటు ఆ యువకుడు గదిలోనే ఉన్నాడు. యువకుడు లోపలికి రావడానికి ఈ-1 విద్యార్థిని సహకరించినట్లు సమాచారం. యువకుడు గదిలోకి వెళ్లడాన్ని గమనించిన తోటి విద్యార్థులు గదికి తాళం వేసి సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారు. దీంతో తాళాలు పగులగొట్టి యువతి, యువకుడిని సిబ్బంది పట్టుకున్నారు. అనంతరం తల్లిదండ్రులను పిలిపించి యువతిని క్యాంపస్ నుంచి అధికారులు పంపారు. ఈ నెల 16న ఘటన జరిగింది. అయితే ఈ విషయాన్ని ట్రిపుల్ ఐటీ అధికారులు గోప్యంగా ఉంచారు.