దేశీయంగా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. ఓవైపు పెళ్లిళ్ల సీజన్ కావటం, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా పసిడి ధర పరుగులు పెడుతోంది. వారం రోజుల వ్యవధిలోనే వెయ్యికి పైగా పెరిగిన బంగారం ధర, రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం కనపడుతోంది. ఓవైపు ప్రపంచాన్ని బయపెడుతోన్న కరోనా వైరస్, మరోవైపు అంతర్జాతీయంగా మాంద్యం ముప్పు అన్నీ కలిసి పసిడికి రేటు పెంచేస్తున్నాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ కూడా భారీగా పడిపోతుండటం బంగారం రేటు పెరిగిపోవటానికి కారణంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత ఏడు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది బంగారం ధర. హైదరాబాద్లో బంగారం ధర 43 వేల మార్క్ను దాటి 44 వేల మార్క్కు చేరువైపోయింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి 43,430 రూపాయలు కాగా, 22 క్యారెట్ల బంగారం 40 వేలకు చేరుకుంది. గత ఐదు రోజుల్లోనే బంగారం ధరలు 1800 రూపాయలు పెరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బంగారం రేటు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని.. 50 వేల మార్క్ దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నాయి మార్కెట్ వర్గాలు. చైనాలో కోవిడ్ ఎఫెక్ట్ తగ్గేవరకు బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక వెండి కూడా బంగారం బాటలోనే ప్రయాణిస్తోంది. కేజీ వెండి ధర 51 వేల మార్క్ను చేరుకుంది.