ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరప్రదేశ్‌లో ఉన్న గనుల్లోని బంగారాన్ని వెలికితీస్తే అమెరికా తర్వాత మనమే

national |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2020, 11:24 AM

తూర్పు యూపీలోని సోన్‌భద్ర జిల్లాలో బంగారు నిక్షేపాలు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. ఈ ప్రాంతంలో దాదాపు 3,000 టన్నులకుపైగా బంగారు నిక్షేపాలు ఉన్నట్టు జీఎస్‌ఐ, ఉత్తర్‌ ప్రదేశ్‌ గనులు మరియు భూగర్భ శాఖ సంయుక్త సర్వేలో గుర్తించారు. సోన్‌బద్ర జిల్లాలోని సోన్‌పహాడీ, హార్దీ ప్రాంతాలలో ఈ బంగారు గనులు విస్తరించి ఉన్నట్టు అధికారులు తెలిపారు. సోన్‌పహాడీలో 2,943 టన్నులు, హార్దీలో 646 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు జీఎస్‌ఐ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నిక్షేపాలను వెలికితీయడానికి మైనింగ్‌ కార్యక్రమాన్ని లీజుకు ఇవ్వాలని యూపీ ప్రభుత్వం యోచిస్తోంది.


దీనిపై సర్వే కొనసాగుతుండగా, ఈ-టెండరింగ్‌ ద్వారా వేలం నిర్వహణకు ఏడుగురు సభ్యుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బంగారంతో పాటు యురేనియం నిల్వలు కూడా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సోన్‌భద్రలోని బంగారు నిక్షేపాలు ప్రస్తుతం దేశంలో ఉన్న 618.2 టన్నుల బంగారం కంటే ఐదు రెట్లు ఎక్కువ.. దీని విలు రూ.12 లక్షల కోట్లపై మాటే ఉంటుంది. దాదాపు 20 ఏళ్లపాటు ఈ ప్రాంతంలో మైనింగ్‌కు అవకాశం ఉందని జీఎస్ఐ అంచనా వేసింది. యూపీ భూగర్భ, గనుల శాఖకు చెందిన బృందం.. మ్యాపింగ్, జియో-ట్యాగింగ్ ద్వారా నిక్షేపాలను గుర్తించింది.


 


జీఎస్ఐ అంచనాల నిజమైతే బంగారు నిల్వల్లో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానానికి చేరుతుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం.. మొత్తం 8,133.5 టన్నులతో అమెరికా తొలి స్థానంలో ఉండగా, జర్మనీ (3,366 టన్నులు), ఐఎంఎఫ్ (2,814 టన్నులు), ఇటలీ (2,451.8 టన్నులు), ఫ్రాన్స్ (2,436 టన్నులు)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


 


మొత్తం సర్వే పూర్తయిన తర్వాత డైరెక్టరేట్‌కు నివేదిక సమర్పించి.. మైనింగ్ వెలికితీతకు ఆక్షన్ లాంటి తదుపరి చర్యలు చేపడతామని సోన్‌భద్ర జిల్లా మైనింగ్ అధికారి తెలిపారు. బంగారంతో పాటు పులావార్, సలాయ్‌డి బ్లాక్‌లో అండూలూసైట్, అల్యూమినియం నెసోసిలికేట్ (95.02 టన్నులు) లాంటి ఖనిజాలు ఉన్నట్టు గుర్తించారు. పట్వాద్‌లో పొటాష్ (9.46 టన్నులు), భారాహరిలో ఇనప ఖనిజం (14.97 టన్నులు) ఉన్నాయని జీఎస్ఐ సర్వేలో ధ్రువీకరించారు. సోన్‌భద్ర జిల్లా ఇప్పటికే పవర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఏడు పవరు ప్లాంట్‌లు ఉన్నాయి. దేశంలోని వెనుకబడి జిల్లాల్లో ఒకటైన సోన్‌భద్రకు కేంద్ర ప్రత్యేక నిధులు కూడా అందుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com