అనుమానం పెను భూతమైంది. కట్టుకున్న భార్యను విచక్షణ రహితంగా కొట్టి డ్రైనేజీలో పడేశాడు ఓ భర్త. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా కావలికి చెందిన రమీజా, షేక్ షరీఫ్ భార్యా భర్తలు. ఇటీవల ఫరీఫ్ రమీజా పై అనుమానం పెంచుకున్నాడు. నిత్యం ఆమెను మానసికంగానూ,శారీరకంగానూ హింసిస్తున్నాడు. పరువు పోతుందని రమీజా ఎవరికి చెప్పుకోలేదు. బుధవారం రాత్రి కూడా వారికి గొడవ జరిగింది. ఈ సమయంలో షరీఫ్ సోదరి కూడా ఇంట్లోనే ఉంది. షరీఫ్ ఆగ్రహంతో రమీజాను చితకబాదాడు. ఇందుకు షరీఫ్ సోదరి కూడా సహకరించింది. అనంతరం రమీజాను ఇంటి ముందు ఉన్న డ్రైనేజిలో పడేశారు. దీంతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమె రాత్రంతా మురికి కాల్వలోనే పడిఉంది.
ఉదయం స్థానికులు ఆమెను డ్రైనేజీలో గుర్తించి ఆమెకు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రమీజాను ఆస్పత్రికి తరలించారు. రమీజా భర్త షేక్ షరీఫ్, ఆయన సోదరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.