ఓ వివాహిత కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం విజయవాడలో చోటు చేసుకుంది. గమనించిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో ఆమెను కాపాడారు. వివరాలు.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ మహిళ, తన రెండేళ్ల కొడుకుతో ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంది. అనంతరం తన కుమారుడిని అక్కడే వదిలేసి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో పోలీసులు వెంటనే ఈతగాళ్ల సాయంతో మహిళను రక్షించి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే సదరు మహిళ ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆమెను స్వస్థలానికి తీసుకెళ్లారు.