బండిలో పెట్రోల్ అయిపోయి.. అది ఎక్కడైనా ఆగిపోయిందంటే.. అప్పుడప్పుడూ ఇలా జరగడం మామూలే కదా అనుకుంటాం.. అదే కారు వున్నవాళ్లయితే.. ముందుగానే పెట్రోల్ చూసుకోవాలి కదా.. అని అనుకుంటాం.. ఏకంగా విమానం కూడా ఇంధనం లేక ఆగిపోతే.. ఏం చేస్తాం.. ఇలాంటి సంఘటనే ఇప్పుడు అనంతపురం జిల్లాలో జరిగింది. బ్రహ్మసముద్రం మండలం ఎరడికేర దగ్గర ఓ జెట్ విమానం పొలాల్లో దిగింది. జిందాల్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు బళ్లారి నుంచి బెంగళూరుకి వెళ్తుండగా విమానంలో ఇంధన సమస్య ఏర్పడడంతో అత్యవసరంగా దిగినట్లు సమాచారం. విమానం వెళ్తున్నప్పుడు అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా, విమానం మాత్రం అటూ ఇటూ ఊగుతూ ఉంది. దాంతో పైలట్కి అనుమానం వచ్చింది. అది కూలిపోతుందేమో అనుకున్నాడు. అందుకే హడావుడిగా దాన్ని ఎక్కడైనా ల్యాండ్ చెయ్యాలనుకున్నాడు. కింద చూస్తే పొలాలు తప్ప ఏమీ లేవు. ఇక దేవుడే దిక్కనుకుంటూ పొలాల్లో దింపేశాడు. లక్కీగా ఆ విమానం పొలాల్లో పద్ధతిగా దిగింది. దాంతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. జరిగిన ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.