శ్రీకాకుళం జిల్లా పలాసలోని వజ్రపుకొత్తూరులో దారుణం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ పై ఓ యువతి శవం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు.. పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు అక్కడికి వచ్చేటప్పటికే ఊరి జనం మొత్తం శవం చుట్టూ గుమిగూడారు. అందర్నీ పక్కకి జరుపుతూ డెడ్బాడీ దగ్గరకు పోలీసులు వెళ్లగానే... ఆ అమ్మాయి తమ కూతురే అంటూ 16 ఏళ్ల ఆ యువతి శవం పక్కనే కూర్చొని బోరున ఏడుస్తూ పోలీసులను వేడుకున్నారు తల్లిదండ్రులు. తమ కూతుర్ని నిర్భయ తరహాలో గ్యాంగ్ రేప్ చేసి చంపేశారనీ, దుర్మార్గులకు కఠిన శిక్ష వెయ్యాలనీ, కనీసం నలుగురు కలిసి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపించారు. అసలేం జరిగిందని పోలీసులు అడిగితే... అర్థరాత్రి రెండు గంటలకు నిద్రలేచిన తమ కూతురు... బాత్రూంకి వెళ్తానని వెళ్లి... తిరిగి రాలేదన్న తల్లిదండ్రులు.. ఆమె కోసం రాత్రంతా తాము, ఊరి జనం వెతికామని చెప్పారు. ఆమెను ఓ యువకుడు తీసుకెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. అలా ఎలా చెప్పగలరని అడిగితే... తమ కూతురు చదువుతున్న కాలేజీలోనే అతడు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడనీ, కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్నాడనీ చెప్పారు. తమ కూతురికి మాయమాటలు చెప్పి అర్థరాత్రి బయటకు తీసుకెళ్లి రేప్ చేసి చంపేసి, రైల్వే ట్రాక్పై పడేసి ఉంటారని ఆరోపించారు. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.