జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలకు ఆరోగ్య పరీక్షలు చేస్తుండగా ఓ దారుణం వెలుగు చూసింది. 12 ఏళ్ల బాలిక గర్భంతో ఉన్నట్టు గుర్తించిన వైద్యులు విస్తుపోయారు. ఆ వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. ఐటీడీఏ అధికారుల కథనం ప్రకారం.. ఒడిశాలోని గంజాం జిల్లా బత్రసాయి పరిధిలోని గౌడుగ్రామానికి చెందిన బాలిక (12) తల్లిదండ్రులు మరణించడంతో అనాథగా మిగిలింది.
శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని బుడారిసింగి పంచాయతీ పరిధిలోని గుడ్డికోలకు చెందిన యువకుడు, తనకు మేనకోడలు అయిన బాలికను ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం కల్పించాడు. ఈ క్రమంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. శుక్రవారం జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిపురం ఆరోగ్య కేంద్రంలో బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఆమె గర్భిణి అని తేలడంతో విస్తుపోయిన వైద్యాధికారులు వెంటనే సీతంపేట ఐటీడీఏ అధికారులకు సమాచారం అందించారు. వారు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మహిళలపై నిత్యం ఎదో ఒక చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నపిల్లలను సైతం వదలడం లేదు. మైనర్ కు పెళ్లి చేయకూడదని చెప్పి కౌన్సలింగ్ ఇచ్చిన పట్టించుకోవడం లేదు. అర్థం కానీ వయసులో పెళ్లి చేసి కొంత మంది తల్లితండ్రలు కూడా పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇలా చేయకుండా పిల్లలను చదివించి పిల్లల భవిష్యత్తును సరైన మార్గంలో నడిపించాలని ఆశిస్తున్నాము.