ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నో నోములు నోచగా పుట్టిన బిడ్డ.. చనిపోయింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 21, 2020, 12:28 PM

తల్లిదండ్రులు ఎన్నో నోములు నోచగా ఆమె వారికి జన్మించింది. వారిది పేద కుటుంబమైనా తల్లిదండ్రులు ఆమెను అల్లారు ముద్దుగా పెంచారు. అన్ని ఆశలు ఆమె పైనే. ఆ యువతి కూడా తల్లిదండ్రుల ఆశలు నీరుగాకుండా కష్టపడి చదువుతోంది. చిన్నప్పటి నుంచి కళ్యాణి చదువులో చురుకుగా ఉండేది. ప్రభుత్వ ఉద్యోగం సాధించి మంచి స్థాయిలో ఉంటానని తల్లిదండ్రులకు మాటిచ్చింది. కానీ ఆ మాట తీర్చకుండానే వారికి దూరమైంది.


సంక్రాంతి సందర్భంగా సరదాగా సినిమాకు వెళుదామనుకుంది. కానీ అదే ఆమెకు చివరి ప్రయాణమైతుందని ఊహించలేదు. ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబలించింది. ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఆ యువతి కన్న కలలు ఆవిరయ్యాయి. ఆ తల్లిదండ్రులకు తానిచ్చిన మాట నెరవేర్చకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. ఈ హృదయ విదారక గాథకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొప్పరవలస గ్రామానికి చెందిన సంగాపు తిరుపతి, రమణమ్మ దంపతుల ఏకైక కూతురు కళ్యాణి. కళ్యాణి విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. సంక్రాంతి సెలవుల సందర్బంగా ఇంటికి వచ్చింది. జనవరి 17వ తేది స్నేహితులతో కలిసి రాజాం పట్టణంలో సినిమా చూసేందుకు ఆటోలో బయల్దేరింది. ఇంతలో ఆటో అరసాడ వద్ద కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కళ్యాణికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేదు. కళ్యాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.


దీంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు. చదువులో చురుకుగా ఉండే కళ్యాణి చనిపోయిందంటే తాము నమ్మలేక పోతున్నామని క్లాస్ మేట్స్, అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణిది నిరుపేద కుటుంబం కావడంతో వారిని ప్రభుత్వం తరపున ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com